*ఆరోగ్యవంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే*
*చించోడులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం*
షాద్ నగర్ ప్రజావాణి, ఆగస్టు0 5: ఆరోగ్యవంతమైన బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే పునాదిగా నిలుస్తాయని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని సబ్ సెంటర్ “ఎ” అర్బన్–2 అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ పద్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తూ తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమని, అవి రోగనిరోధక శక్తిని పెంచి శిశువును అనేక వ్యాధుల నుంచి కాపాడతాయని చెప్పారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని సూచించారు. తల్లిపాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడటంతో పాటు తల్లి–బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంగన్వాడి సూపర్వైజర్ సంధ్య మాట్లాడుతూ, గర్భిణులు అంగన్వాడి కేంద్రాల్లో అందించే బాలామృతం, గుడ్లు, ఇతర పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, ఆరోగ్య సిబ్బంది అందించే ఐరన్ మాత్రలను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. తల్లులు బిడ్డకు పాలు ఇచ్చిన అనంతరం భుజంపై ఉంచి వీపు మెల్లగా తట్టాలని తెలిపారు.
అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు అక్కడికి వచ్చిన చిన్నారికి బాలామృతం తినిపించారు.
ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ ఆరిఫా బేగం, 20వ వార్డు కౌన్సిలర్ పి. గోపాల్, అంగన్వాడి టీచర్లు పద్మ, కవిత, రాధాదేవి, జయమ్మ, శ్రీదేవి, ఏఎన్ఎం ఇస్తే రాణి, అంగన్వాడి ఆయా కళావతి, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింత తల్లులు పాల్గొన్నారు.
