prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 10:31 am Digital Edition : RAJASHEKARREDDY

ఆదర్శ పాఠశాల విచారణ కమిటీపై ఆరోపణలు.. సమగ్ర విచారణ జరపాలి- ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మహేష్

బెజ్జంకి, జూలై 26 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులపై డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు.ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విచారణ కమిటీపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విచారణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత విచారణ కమిటీ సభ్యులపై కఠిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో విశ్వాసం పెంపొందించేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ నివేదికను బహిర్గతం చేసి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని, లేనిపక్షంలో ఈ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని దొంతరవేణి మహేష్ హెచ్చరించారు.