‘ఫస్ట్ మైల్-లాస్ట్ మైల్ RTC ఆటో’ పథకం డ్రైవర్లను మోసం చేయడమే: ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్
గోదావరిఖని ఆగస్టు 1 ప్రజావాణి :
ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడం మానుకొని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తీవ్రంగా డిమాండ్ చేశారు. గోదావరిఖని బస్టాండు అడ్డాలో నిర్వహించిన “ఆటో డ్రైవర్ల దినోత్సవం” సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి సీఎంను ఇంతవరకు చూడలేదని విమర్శించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన ‘ఆటో సంక్షేమ బోర్డు’ ఏర్పాటు, ప్రతి ఏటా రూ.12,000 ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత హామీలను పక్కనబెట్టి, మళ్లీ కొత్తగా ఆటో డ్రైవర్లను మోసం చేయడానికి “ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ ఆర్టీసీ ఆటో” అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి లబ్ధి చేకూర్చని, వారి ఉపాధిని దెబ్బతీసే ఇలాంటి పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
రామగుండం కార్పొరేషన్ ఆటో జేఏసీ అధ్యక్షుడు ఎం.డి. బురహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జిల్లా కో-కన్వీనర్ ఎస్.కే. జబ్బర్, జిల్లా నాయకులు కాజీపేట రాజయ్య, పల్లె బాపు, రాజేశం, మడిపెద్ది రమేష్, షరీఫ్ లతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.