prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 11:16 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం – గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే కీలకం – కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

ఎన్టీఆర్ జిల్లా.ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) నందిగామ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం నందిగామలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలంటే ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు.గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే గ్రామ, మండల,జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టమవుతుందని అన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ అనేక కీలక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేయడం ద్వారా పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామంలో త్వరితగతిన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీని రాష్ట్రంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ మాట్లాడుతూ, గ్రామ కమిటీలు పార్టీ అభివృద్ధికి పునాది వంటివని, వీటి ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి మాట్లాడుతూ, వ్యవసాయదారులకు మార్కెట్ యార్డుల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోసాని గురునాథం, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పోరుగొండి నరసింహారావు, నందిగామ పట్టణ అధ్యక్షులు మునగంటి కామేశ్వరరావు, చందర్లపాడు మండల అధ్యక్షులు గుప్తా బాలకృష్ణ, మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.