మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తోందని బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్ కొంకట మౌనిక చక్రధరి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు.
సోమవారం రోజున చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు భోజ మానస–మల్లేశం, మాచమల్ల అఖిల–కిరణ్ కుటుంబాలు నూతన గృహాలలో గృహప్రవేశం నిర్వహించగా, సర్పంచ్ కొంకట మౌనిక ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెండో విడతలో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బడుకోలు దేవేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి మడమడకల రాజిరెడ్డి, వార్డు సభ్యులు సుకోషి పద్మ, కొంకట బిక్షపతి, అందె సంపత్, మల్లిఖార్జున్ రెడ్డి, మాచమల్ల కిషోర్, మామిడి చంద్రమౌళి, భోజ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.