prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:25 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి బూరుగడ్డ పుష్పనగేష్

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి: బూరుగడ్డ పుష్పనగేష్

 

రామచంద్రపురం,జులై 9 (ప్రజావాణి):రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గురువారం సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ చలపతి రావును కలిసి రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఇటీవల సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి ఇదే అంశంపై వినతిపత్రం అందజేయగా, ఆయన హౌసింగ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడి సంబంధిత అధికారులకు ఎండోర్స్ చేసిన లేఖను పంపుతున్నట్లు తెలిపారని పుష్పనగేష్ వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కోరారు. అలాగే ఇప్పటికీ అనేక మంది పేద కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తూ, రోజువారీ కూలి పనులతో జీవనం సాగిస్తున్నందున అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ శాఖ అధికారులు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.