prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:11 am Digital Edition : PRAJA VANI

అర్ధరాత్రి కస్తూర్బా విద్యాలయం నుంచి ముగ్గురు బాలికలు బయటకు

గోడ దూకి వెళ్లిన విద్యార్థినులు.. ఉదయం హాస్టల్ సమీపంలో గుర్తింపు
ప్రజావాణి – శాయంపేట
శాయంపేట మండలంలోని గోవిందపూర్ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. 6, 7, 8వ తరగతులకు చెందిన ముగ్గురు విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దూకి బయటకు వెళ్లినట్లు హాస్టల్ సిబ్బంది గుర్తించారు.
హాస్టల్‌లో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ విద్యార్థినులు అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లిన ఘటనపై భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి. విద్యార్థినులు కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఉదయం తనిఖీలు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయం సుమారు 5 గంటల సమయంలో పోలీసులకు, మండల తహసీల్దార్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో విద్యార్థినులు హాస్టల్ సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. విద్యార్థినులను విచారించగా, హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక బయటకు వెళ్లినట్లు వారు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన నేపథ్యంలో కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, రాత్రివేళ పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
క్యాప్షన్:
“హాస్టల్‌ నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు.. ఉదయానికే సురక్షితంగా గుర్తింపు”