అమీనాబాద్, జల్లి పాఠశాలల్లో ఏబీవీపీ అవగాహన సదస్సు
చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి
మండల పరిధిలోని అమీనాబాద్, జల్లి గ్రామాల పాఠశాలల్లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ భావాలను పెంపొందించడంతో పాటు విద్యారంగ సమస్యలపై పోరాడటమే ఏబీవీపీ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రక్తదాన శిబిరాలు, గ్రామీణ విద్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో సంస్థ ముందుంటుందని వివరించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం, కాశ్మీర్ అంశాలపై జరిగిన ఆందోళనల్లో ఏబీవీపీ చారిత్రక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ విద్యార్థుల హక్కుల కోసం క్యాంపస్లలో నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నర్సంపేట నియోజకవర్గం జాయింట్ సెక్రెటరీ అజ్మీర సంతోష్ నాయక్, నాయకులు బదావత్ మురళి, తన్వేష్, తేజ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.