ఘట్కేసర్, ఆగస్టు 2 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ గ్రామంలో ఈ నెల 16వ తేదీన ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఆదివారం గ్రామంలోని శ్రీ ఎర్ర పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ మహంకాళి దేవాలయాల ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, నూతన, మాజీ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల నిర్వహణ, అమ్మవార్ల ఊరేగింపు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి ఉత్సవాల తేదీని ఖరారు చేశారు.
ఈ సమావేశంలో పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, నూతన, మాజీ ఆలయ కమిటీ సభ్యులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, కుల పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని అమ్మవార్ల బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
