మల్కాజ్గిరి, జూలై 9: మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న భారీ మొత్తంలో వైన్ను స్వాధీనం చేసుకుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. ప్రణవి ఆదేశాలు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. హనుమంతరావు సూచనల మేరకు జూలై 7వ తేదీ రాత్రి టాస్క్ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించింది.
దాడుల్లో ద్రాక్ష, అనానస్, గువ్వ, మోసంబి, సపోటా, అరటి, తమలపాకు తదితర ఫలాలతో తయారు చేసిన ఏడు రకాల అక్రమ వైన్ను గుర్తించారు. మొత్తం 377.7 లీటర్ల వైన్ను స్వాధీనం చేసుకోగా, ఇది 750 మిల్లీలీటర్ల సామర్థ్యం గల 502 బాటిళ్లకు సమానమని అధికారులు తెలిపారు.
విచారణలో నిందితుడు ఈ వైన్ను చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్లోని వ్యక్తులకు ఒక్కో బాటిల్ను రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నెరెడ్మెట్కు చెందిన ఆంథోనీ పీటర్ (65)ను అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం మరియు ఇతర వస్తువులను పంచనామా నిర్వహించి, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం కాప్రా పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల్లో మల్కాజ్గిరి జిల్లా టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. భరత్ భూషణ్, ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
