అంబేద్కర్ సంఘం నాయకులు బోయినీ వల్లభాయ్ పటేల్
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని శివాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాల్సిన అంబేద్కర్ విజ్ఞాన మందిరం పనులు వివాదాల మధ్య నిలిచిపోయాయి. స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల అభ్యంతరాల కారణంగా నిర్మాణం ముందుకు సాగకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నిర్మాణం చేపట్టే దశలోనే అడ్డంకులు తలెత్తడంతో విజ్ఞాన మందిరం అసంపూర్తిగా మిగిలిపోయింది.ఈ పరిస్థితిపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బోయినీ వల్లభాయ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఉపయోగానికి ఉద్దేశించిన విజ్ఞాన మందిరం పనులు నిలిచిపోవడం వల్ల యువత, విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికే కేటాయించిన స్థలంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా వెంటనే నిర్మాణ పనులు పునఃప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అనవసర వివాదాలతో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకూడదని ఆయన పేర్కొన్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి అంబేద్కర్ విజ్ఞాన మందిరం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.